అమరావతిని కాదనుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, విశాఖపట్నంను రాష్ట్ర పరిపాలక రాజధానిగా ఎంపిక చేయడం ద్వారా రాజకీయం చేయడం కంటే తనకు అభివృద్ధే ముఖ్యమని మరోసారి చాటుకున్నారు. విశాఖ వాసులు మొదటి నుంచి వైస్సార్సీపీని పెద్దగా ఆదరించిన దాఖలాలు లేవు. విశాఖ నుంచి పోటీ చేసిన వైస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ఓడించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీ హవా కొనసాగినప్పటికీ, విశాఖలో మాత్రం టీడీపీ తన పట్టు నిలుపుకుంది. విశాఖ ప్రజలు రాజకీయంగా తనకు దన్నుగా నిలవకపోయినప్పటికీ , పరిపాలక రాజధానిగా విశాఖను ఎంపిక చేసి రాజకీయాలకతీతంగా తాను అభివృద్ధిని కోరుకుంటున్నానని జగన్ చెప్పకనే చెప్పారు.
అభివృద్ధి ఒక్కచోటనే కేంద్రీకృతం కావొద్దని భావిస్తోన్న జగన్మోహన్‌రెడ్డి , వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని భావిస్తున్నారు. గత పాలకులు చేసిన తప్పిదాలను తాను చేయవద్దని భావిస్తోన్న జగన్మోహన్‌రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే, ముందు పరిపాలన వికేంద్రీకరణ జరగాలని యోచిస్తున్నట్లు ఆయన తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా స్పష్టమవుతోంది. పరిపాలన వికేంద్రీకరణను పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు గన్మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు నిర్ణయాన్ని , అమరావతి ప్రాంత ప్రజలు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో విశాఖ ప్రాంత ప్రజలు అంతగా స్వాగతించడం పరిశీలిస్తే రానున్న రోజుల్లో వైస్సార్సీపీకి ఈ నిర్ణయం రాజకీయంగా ఎంతో కలిసి వచ్చే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విశాఖ కార్పొరేషన్‌ను వైస్సార్సీపీ కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే విశాఖను పరిపాలక రాజధానిగా ఎంపిక చేసినప్పటికీ, అది రాజకీయంగా కూడా జగన్మోహన్‌రెడ్డికి కలిసొచ్చే అవకాశముండడం హర్షించదగ్గ పరిణామమని అంటున్నారు. అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తే ప్రజలు తామంతట తామే పట్టం కడుతారని , జగన్ నిర్ణయం ద్వారా మరోసారి రుజువయింద ని అంటున్నారు.